జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిషత్ ఎన్నికల నిర్వహణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించగా, పిటిషనర్ వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలను వినిపించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్లో ఎస్ఈసీ సవాల్ చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి పిటిషన్ను హైకోర్టు పరిశీలనలోకి తీసుకుంది. పిటిషన్ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని, వ్యక్తిగత హోదాలో వేసిన పిటిషన్ను సింగిల్ బెంచ్ కొట్టేసి ఉండాల్సిందని పేర్కొంది. నాలుగు వారాలు కోడ్ ఉండాలని నిబంధన లేదని ఎస్ఈసీ తెలిపింది. సుప్రీంకోర్టు ఏ సందర్భంలో ఆ ఉత్తర్వులు ఇచ్చిందో పరిగణనలోకి తీసుకోలని ఎస్ఈసీ పేర్కొంది. కోడ్ అమలుతో ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోతాయని సుప్రీం వ్యాఖ్యానించింది. వీటిని పరిగణనలోకి తీసుకొని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొట్టేయాలని ఎస్ఈసీ కోరింది.