వార్డు వాలంటీర్ల సేవలపై ఎస్ఈసీ ఆంక్షలు!!
1 min read
Times of Nellore –కోట సునీల్ కుమార్
–ఏపీలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల సేవలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పుర ఎన్నికల నిర్వహణపై పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు పలు సూచనలు చేశారు.
”గుర్తింపు పొందిన పార్టీ ప్రతినిధులతో ఎన్నికల సంఘం మాట్లాడింది. పంచాయతీ ఎన్నికల్లాగే వార్డు వాలంటీర్లపైనా ఫిర్యాదులు వచ్చాయి. రాజకీయ కార్యకలాపాలకు వారు దూరంగా ఉండాలి. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగుతాయి. స్వేచ్ఛాయుత ఎన్నికలకు వాలంటీర్లపై కఠినచర్యలు అవసరం. రాజకీయ ప్రక్రియ నుంచి వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలి. అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వాళ్లు పాల్గొనకూడదు. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదు.
ఓటరు స్లిప్పుల పంపిణీని వార్డు వాలంటీర్లకు అప్పగించవద్దు. వారి కదలికలను నిశితంగా పరిశీలించాలి. లబ్ధిదారుల డేటా దృష్ట్యా వాలంటీర్ల ఫోన్లను నియంత్రించాలి. కమిషన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే కోడ్ ఉల్లంఘనగా పరిగణిస్తాం. సాధారణ బాధ్యతలు నిర్వహించే వాలంటీర్లకు అడ్డంకుల్లేవు” అని ఎస్ఈసీ స్పష్టం చేశారు.